అనుమతిలేకుండా ఇతర కంప్యూటర్లను హ్యాక్ చేసిన మరో ఏఐ సంస్థ ఆంథ్రోపిక్!

Published on: 31 Jul 2026, 03:30 AM
News Article

హైదరాబాద్, జూలై 31, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): కృత్రిమ మేధ (AI) రంగంలో మరో సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. పోటీ సంస్థ 'ఓపెన్‌ఏఐ' (OpenAI) తన ఏఐ మోడల్స్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన తర్వాత, మరో ప్రముఖ ఏఐ సంస్థ 'యాంత్రోపిక్' (Anthropic) కూడా సంచలన ప్రకటన చేసింది. రొటీన్ టెస్టింగ్ సమయంలో తమ ఏఐ మోడల్స్ కూడా అనుకోకుండా ఇంటర్నెట్‌లోకి ప్రవేశించి, మూడు వేర్వేరు సంస్థల సిస్టమ్స్‌ను హ్యాక్ చేసినట్లు యాంత్రోపిక్ అధికారికంగా వెల్లడించింది. ఏఐ అభివృద్ధి వేగం సమాజం సిద్ధంగా ఉన్న దానికంటే వేగంగా సాగుతోందనే ఆందోళనలకు ఈ ఘటనలు మరింత బలాన్నిస్తున్నాయి.పరీక్షల సమయంలో ఓపెన్‌ఏఐ తన మోడల్స్ హగ్గింగ్ ఫేస్ సిస్టమ్స్‌ను హ్యాక్ చేసినట్లు గతంలో వెల్లడించింది. ఆ ప్రకటనతో అప్రమత్తమైన యాంత్రోపిక్ సంస్థ, తన సిస్టమ్స్‌పై అంతర్గత సమీక్ష చేపట్టింది. ఈ క్రమంలో గతంలో నిర్వహించిన 140,000లకు పైగా మూల్యాంకనాలను పరిశీలించగా, మూడు సందర్భాల్లో తమ ఏఐ మోడల్స్ ఇంటర్నెట్‌లోకి ప్రవేశించి మూడు వేర్వేరు సంస్థల ప్రొడక్షన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోకి అనధికారికంగా ప్రవేశించినట్లు గుర్తించారు.

సాధారణంగా ఏఐ సామర్థ్యాలను పూర్తిగా అంచనా వేసేందుకు పరీక్షల సమయంలో భద్రతా నిబంధనలు తొలగిస్తుంటారు. ఈ క్రమంలో మోడల్స్‌కు ఒక ఫేక్ 'క్యాప్చర్ ది ఫ్లాగ్' ఛాలెంజ్ ఇవ్వగా.. వాటిని రిట్రైవ్ చేయడానికి మోడల్స్ ప్రయత్నించాయి. అయితే, యాంత్రోపిక్ భాగస్వామ్య సంస్థ మధ్య జరిగిన అపార్ధం కారణంగా ఏఐ మోడల్స్‌కు ఓపెన్ ఇంటర్నెట్ యాక్సెస్ లభించింది. వీక్ పాస్‌వర్డ్‌లను ఎక్స్‌ప్లాయిట్ చేయడం, లాగిన్ అవసరం లేని సిస్టమ్ పాయింతులను కనుగొనడం వంటి ప్రాథమిక పద్ధతుల ద్వారా మోడల్స్ ఆ సిస్టమ్స్‌లోకి చొరబడ్డాయి. వీటిలో అత్యంత అధునాతన మోడల్ మాత్రం తాను ఇంటర్నెట్‌లో ఉన్నానని గుర్తించి దానంతట అదే ఆగిపోయిందని కంపెనీ తెలిపింది. ఈ ఘటనలు ఏప్రిల్ నెలలోనే జరిగినప్పటికీ, తాము హ్యాక్ అయినట్లు ఆ మూడు సంస్థలకు కూడా తెలియకపోవడం గమనార్హం. ఓపెన్‌ఏఐ బాటలోనే యాంత్రోపిక్ కూడా అన్ని సైబర్ ఎవాల్యుయేషన్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఏఐ ఏజెంట్లు అనుకోకుండా ఇతర సంస్థల సిస్టమ్స్‌ను హ్యాక్ చేయడం ఒక్క కంపెనీకి మాత్రమే పరిమితం కాదని స్పష్టమవడంతో, ఏఐ అభివృద్ధి వేగాన్ని నియంత్రించడంపై మరియు కఠినమైన భద్రతా మార్గదర్శకాలను అమలు చేయడంపై ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి.