ఉదయం అల్పాహారం ఆలస్యంగా తీసుకుంటున్నారా? అయితే ప్రాణాలకే ముప్పు

Published on: 25 Aug 2026, 06:51 AM
News Article

న్యూఢిల్లీ, ఆగస్ట్ 25, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఏ సమయంలో తీసుకుంటున్నామనే అంశం మన ఆయురారోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా శాస్త్రీయ అధ్యయనం హెచ్చరిస్తోంది. కేవలం ఏం తింటున్నామనే కాకుండా, ఏ సమయంలో మొదటి ఆహారాన్ని తీసుకుంటున్నాము అనేది మన జీవితకాలాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిష్టాత్మక 'యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్న్యూట్రిషన్' (European Journal of Clinical Nutrition) లో ప్రచురితమైన ఈ భారీ అధ్యయనం పలు ఆసక్తికర మరియు ఆందోళనకర విషయాలను వెల్లడించింది.

40 ఏళ్లు పైబడిన 31,000 మందికి పైగా పెద్దలపై నిర్వహించిన ఈ పరిశోధనలో, మొదటి మరియు చివరి ఆహారం తీసుకునే సమయాలకు, మరణాల ముప్పునకు మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు తేలింది.

అధ్యయనంలో వెల్లడయిన ముఖ్యమైన అంశాలు:

  • మధ్యాహ్నం తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేస్తే ముప్పు: ఉదయం 7 నుండి 8 గంటల మధ్య అల్పాహారం తీసుకునేవారితో పోలిస్తే, మధ్యాహ్నం తర్వాత మొదటి ఆహారాన్ని తీసుకునేవారిలో ఏ కారణం చేతనైనా ముందస్తు మరణం సంభవించే ముప్పు 29% ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.
  • క్రమంగా పెరుగుతున్న రిస్క్: ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య అల్పాహారం చేసేవారిలో 10%, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య చేసేవారిలో 19% మేర ముందస్తు మరణ ముప్పు పెరుగుతున్నట్లు గుర్తించారు.
  • గుండె జబ్బుల ముప్పు: మధ్యాహ్నం తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అలవాటు ఉన్నవారిలో గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి హృదయ సంబంధిత సమస్యలతో మరణించే ప్రమాదం ఏకంగా 46% ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
  • తగ్గుతున్న ఆయుష్షు: 50 ఏళ్లు దాటిన వారు రోజూ ఆలస్యంగా అల్పాహారం తీసుకోవడం వల్ల వారి సగటు ఆయుష్షు దాదాపు 2.5 సంవత్సరాలు తగ్గే అవకాశం ఉందని అధ్యయనం హెచ్చరిస్తోంది.

జీవన గడియారాలపై ప్రభావం:

క్రమం తప్పకుండా చాలా ఆలస్యంగా అభ్యాహారం చేయడం వల్ల శరీరంలోని 24 గంటల జీవన గడియారం (Circadian Rhythm) దెబ్బతింటుందని పరిశోధకులు పేర్కొన్నారు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడంతో పాటు, ఒత్తిడి హార్మోన్లు అధికమై ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని స్పష్టం చేశారు. అయితే ఇది ప్రత్యక్ష కారణం కాకపోయినా, అనారోగ్యకరమైన జీవనశైలికి ఒక ప్రధాన సూచికగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.