ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీను నాయక్
Published on: 15 Jun 2026, 10:22 AM
హైదరాబాద్ న్యూస్టైమ్, సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన కరంటోతు శ్రీను నాయక్ సోమవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మండల అధ్యక్షుడిగా తనకు తిరిగి బాధ్యతలు అప్పగించినందుకు గాను ఎమ్మెల్యేకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీను నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను గడపగడపకూ తీసుకెళ్తానని, మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ మర్యాదపూర్వక భేటీలో పలువురు స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.