ఐదు పెళ్లిళ్ల ‘మాయలాడి’ కథ కంచికి..

Published on: 27 Jun 2026, 05:32 AM
News Article

హైదరాబాద్, జూన్ 27 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): పెళ్లిళ్ల పేరుతో అమాయక యువకులను నమ్మించి, లక్షలాది రూపాయల కట్న కానుకలతో చెక్కేస్తున్న ఒక కిలేడీ ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుని మోసాలకు పాల్పడిన నిత్య పెళ్లికూతురు వజ్రపు మణి అలియాస్ శ్వేతారెడ్డి అలియాస్ కీర్తి (27)ని అనంతపురం జిల్లా పెద్దవడుగూరు పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామానికి చెందిన వజ్రపు పాండు కుమార్తె అయిన ఈ మాయలాడి వెనుక ఒక పెద్ద పెళ్లిళ్ల బ్రోకర్ల ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

మూడు రోజులు కాపురం.. రైలెక్కి మాయం: విజయవాడకు చెందిన మధ్యవర్తులు సుమప్రియ, అశోక్, శశికళ, రామకృష్ణ అనే బ్రోకర్ల ద్వారా ఈమె పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటుంది. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లి గ్రామానికి చెందిన యాపర్ల సుధీర్ రెడ్డికి ఈమెను పరిచయం చేశారు. మాయమాటలు నమ్మిన సుధీర్ రెడ్డి.. 2025లో ఏకంగా రూ.3.8 లక్షల ఎదురుకట్నం ఇచ్చి మణిని వివాహం చేసుకున్నాడు. పెళ్లయ్యాక భర్త ఇంట్లో కేవలం మూడు రోజులు మాత్రమే ఉన్న ఈ నిందితురాలు.. దాంపత్య జీవితం ప్రారంభించకుండానే తనకు ఒంట్లో బాగోలేదని, పుట్టింటికి వెళ్లాలని భీష్మించుకుంది. దీంతో సుధీర్ రెడ్డి ఆమెను రైలెక్కించగా.. రైలు నంద్యాల స్టేషన్‌కు చేరగానే భర్త కళ్లుగప్పి మాయమైపోయింది.

ఆరా తీస్తే ఇద్దరు పిల్లల తల్లి.. ఆరో పెళ్లికి స్కెచ్ వేస్తుండగా: రైల్వేస్టేషన్ మొత్తం గాలించినా భార్య దొరకకపోవడంతో సుధీర్ రెడ్డి మధ్యవర్తులకు ఫోన్ చేయగా అందరి ఫోన్లు స్విచాఫ్ వచ్చాయి. మోసపోయానని గ్రహించిన బాధితుడు పెద్దవడుగూరు పోలీసులను ఆశ్రయించగా.. విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. ఈమెకు అప్పటికే ఐదుగురితో పెళ్లిళ్లయిందని, ఒక కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారని పోలీసులు తేల్చారు. గత ఏడాది నుండి పోలీసులు ఈమె కోసం గాలిస్తుండగా.. తాజాగా కర్ణాటకలోని మల్లెకుప్ప గ్రామానికి చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని కాపురం పెట్టినట్లు పక్కా సమాచారం అందింది. అక్కడ నుండి ఆమె మదనపల్లెకు వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు.. మాటు వేసి నిత్య పెళ్లికూతురు మణిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు.