కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్టానం అల్టిమేటం..సాయంత్రంలోగా రాజీనామా చేయాలి
హైదరాబాద్, సెప్టెంబర్ 3, 2026 (హైదరాబాద్ న్యూస్టైమ్): తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖను తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రంలోగా ఆమె రాజీనామా చేయకపోతే, నేరుగా లోక్భవన్కు బర్తరఫ్ లేఖ పంపిస్తామని ఏఐసీసీ అధిష్టానం తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకునే లోపే ఆమె రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా ఆమెకు సూచనలు చేస్తూ.. బర్తరఫ్ చేయాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దని, వెంటనే రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని సురేఖ అధిష్టానాన్ని కోరినప్పటికీ.. అక్కడి నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. దీంతో బర్తరఫ్ వేటు పడటం కంటే.. తనకు తానుగా హుందాగా రాజీనామా చేయడమే మంచిదని ఆమె నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు, పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కేవలం నాయకురాలిగా కొనసాగడం తనకు అవమానకరమని కొండా సురేఖ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఆమె రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది