కొండా సురేఖపై వేటు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. లోక్‌భవన్‌కు బర్తరఫ్ లేఖ

Published on: 03 Sep 2026, 09:07 AM
News Article

హైదరాబాద్, సెప్టెంబర్ 3, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణ రాజకీయాల్లో ఊహించినట్టుగానే సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రి కొండా సురేఖను తక్షణమే తొలగిస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సిందిగా కోరుతూ లోక్‌భవన్‌లోని గవర్నర్ కార్యాలయానికి అధికారికంగా లేఖ పంపారు. కొద్దిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన కొండా సురేఖ ఎపిసోడ్ ఎండ్‌కార్డ్ పడింది. పార్టీ లైన్ దాటడం, క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుచరులతో సమావేశమైన కొండా సురేఖ మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందుకు వస్తామని ప్రకటించిన వేళ.. ప్రభుత్వ నుంచి ఈ బర్తరఫ్ ఉత్తర్వుల వార్త వెలువడటం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.