గ్యాస్ సిలిండర్ కోసం ఫినాయిల్ తాగిన మ‌హిళ‌!

Published on: 30 Mar 2026, 05:03 AM
News Article

గుత్తి (అనంతపురం): సాధారణంగా కుటుంబ కలహాలు లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యాయత్నాలు జరుగుతుంటాయి. కానీ, అనంతపురం జిల్లాలో కేవలం ఒక 'గ్యాస్ సిలిండర్' కోసం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. గుత్తి మండలం తొండపాడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

మూడు నెలల నిరీక్షణ.. మూడు రోజుల విఫలయత్నం:

గ్రామానికి చెందిన హరికృష్ణ, మహాలక్ష్మి దంపతుల ఇంట్లో గ్యాస్ అయిపోయి మూడు నెలలు కావస్తోంది. అప్పటి నుంచి మహాలక్ష్మి కట్టెల పొయ్యిపై వంట చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. సిలిండర్ తీసుకురావాలని ఆమె పదేపదే కోరినప్పటికీ, డబ్బులు సర్దుబాటు కాక భర్త వాయిదా వేస్తూ వచ్చాడు.

ఘటనకు దారితీసిన పరిస్థితులు:

చివరికి ఆదివారం డబ్బులు సర్దుబాటు కావడంతో హరికృష్ణ గ్యాస్ కోసం గుత్తి పట్టణానికి వెళ్లాడు. అయితే అక్కడ సిలిండర్ దొరకకపోవడంతో గత మూడు రోజుల్లాగే మళ్లీ ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు. తాను పడుతున్న ఇబ్బందులను భర్త పట్టించుకోవడం లేదని, గ్యాస్ తేవడం లేదని తీవ్ర మనస్థాపానికి గురైన మహాలక్ష్మి.. ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.


అపస్మారక స్థితిలో ఉన్న మహాలక్ష్మిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.