చౌటుప్పల్‌లో భారీగా గంజాయి పట్టివేత

Published on: 29 Aug 2026, 03:44 AM
News Article

చౌటుప్పల్, ఆగస్ట్ 29, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు విజయవంతంగా పట్టుకున్నారు. చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు, సీఐ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో ఈగల్ ఫోర్స్ సహకారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 20.360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 27న చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఎస్. కృష్ణమాల్‌కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. పోలీస్ సిబ్బందితో కలిసి NH-65 హైదరాబాద్ రోడ్డులోని చౌటుప్పల్ ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న (OD02DS897 నంబర్ గల) 'ఫ్రాంక్స్' (FRONX) కారును ఆపి తనిఖీ చేయగా, వాహనం వెనుక డిక్కీలో బ్రౌన్ టేపులతో చుట్టిన ప్యాకెట్లు బయటపడ్డాయి. వాటిని పరిశీలించగా సుమారు 20 ప్యాకెట్లలో 20.360 కిలోల గంజాయి ఉన్నట్లు తూకం వేసి నిర్ధారించారు.

తక్కువ ధరకు కొని.. ఇక్కడ అధిక ధరకు విక్రయం: ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపారా జిల్లా రాజ్‌నగర్‌కు చెందిన త్రిలోచన్ సామంత్రా (30), సాగర్‌బాల్ (23) లుగా నిందితులను గుర్తించారు. ఒడిశా నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, తెలంగాణలో అధిక ధరకు విక్రయించేందుకు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గంజాయి రవాణా చేసేందుకు వీరికి రూ. 50,000 ఆఫర్ చేసినట్లు వెల్లడైంది. నిందితుల నుంచి గంజాయితో పాటు మూడు మొబైల్ ఫోన్లు, రవాణాకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ అక్రమ రవాణా వెనుక మరికొందరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.