తమిళిసైకి తప్పని ఓటమి.. వరుసగా 7వ సారి!

Published on: 04 May 2026, 05:06 PM
News Article

హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 04, 2026 చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఎన్నికల ఫలితాల్లో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడులోని చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, డీఎంకే అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. దీంతో ఆమె తన రాజకీయ జీవితంలో వరుసగా ఏడోసారి ఎన్నికల బరిలో ఓటమిని మూటగట్టుకున్నట్లయింది.

గతంలో మూడుసార్లు అసెంబ్లీకి, మూడుసార్లు పార్లమెంటుకు పోటీ చేసిన తమిళిసై, తాజా ఎన్నికల్లో గెలిచి తన ఓటముల పరంపరకు బ్రేక్ వేయాలని భావించారు. ఇందుకోసం గవర్నర్ పదవికి సైతం రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఓటర్లు మాత్రం ఆమెకు మళ్ళీ మొండిచేయి చూపారు. వరుస ఓటములతో తమిళిసై రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.