తల్లీబిడ్డల మృతి ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు
గుండాల, జూన్ 19 (హైదరాబాద్ న్యూస్టైమ్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభూనిగూడెం గ్రామానికి చెందిన వనజ(20) అనే గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సు చేసిన అవగాహన రాహిత్య ప్రసవం వల్ల శిశువు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర రక్తస్రావంతో తల్లి కూడా చికిత్స పొందుతూ మరణించింది. అయితే, మృతురాలికి అంత్యక్రియలు పూర్తి చేసి కర్మకాండల అనంతరం కుటుంబ సభ్యులు చితాభస్మం సేకరిస్తుండగా, అందులో శస్త్ర చికిత్సకు వాడే కత్తెర బయటపడడం తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే తల్లీబిడ్డల ప్రాణాలు తీసిందనడానికి ఈ కత్తెరే నిదర్శనమంటూ బాధితులు బోరున విలపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఆసుపత్రిలో కేవలం సాధారణ ప్రసవమే జరిగిందని, చితాభస్మంలోకి కత్తెర ఎలా వచ్చిందో తమకు తెలియదని వైద్యాధికారులు దాటవేసే ప్రయత్నం చేయడం గమనార్హం.