దైవ దర్శనం కోసం తిరుపతి వస్తున్నారా? లగ్జరీ హోటళ్లలో మీ వస్తువులు జర భద్రం
* వారంలోనే రెండు భారీ దొంగతనాలు.. 'మారస సరోవరం' హోటల్లో ఘటన
* ఇంటి దొంగలే ఈ పని చేశారా? అనుమానిస్తున్న స్థానికులు
హైదరాబాద్ న్యూస్టైమ్, తిరుపతి, మే 31: దైవ దర్శనం కోసం వచ్చే సంపన్న భక్తులే లక్ష్యంగా తిరుపతిలోని లగ్జరీ హోటళ్లలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మారస సరోవరం హోటల్లో జరిగిన ఘటన సంచలనంగా మారింది. సింగపూర్ నుండి శ్రీవారి దర్శనార్థం వచ్చిన ఎన్నారై ఆర్ముగం కుటుంబం అదే హోటల్లోని రూమ్ నెంబర్ 1017లో బస చేశారు. శుక్రవారం ఉదయం తిరుమలకు దర్శనానికి వెళ్లిన వారు, సాయంత్రం తిరిగి వచ్చి చూసుకోగా.. లాకర్లో ఉంచిన 1,000 అమెరికన్ డాలర్లు మాయమైనట్లు గుర్తించారు. బాధితుడు ఆర్ముగం వెంటనే అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ దుర్గాప్రసాద్ క్రైమ్ నెంబర్ 191/2026 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వారంలోనే ఇదే హోటల్లో రెండు దొంగతనాలు జరగడం గమనార్హం. సరిగ్గా వారం రోజుల క్రితమే ఇదే హోటల్లో బస చేసిన హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారి వద్ద రూ. 20 లక్షలు చోరీకి గురయ్యాయి. వరుసగా ఒకే హోటల్లో ఇటువంటి ఘటనలు జరుగుతుండటంతో, ఇందులో 'ఇంటి దొంగల' హస్తం ఉందేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల భద్రత విషయంలో హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, నిందితులను వెంటనే పట్టుకోవాలని భక్తులు కోరుతున్నారు.