నా ప్రాణాలకు ముప్పు.. కస్టడీకి ఇవ్వొద్దు: సీఐ నాగరాజు

Published on: 02 Jul 2026, 01:08 AM
News Article

హైదరాబాద్, జూలై 02, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తన ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉందని, తనను పోలీసు కస్టడీకి అప్పగించవద్దని సీఐ నాగరాజు న్యాయమూర్తిని వేడుకున్నారు. ఇప్పటికే కేసుకి సంబంధించిన అన్ని వివరాలను తాను వెల్లడించానని ఆయన కోర్టు ఎదుట స్పష్టం చేశారు. టీడీపీ పెద్దల భూదందా నేపథ్యంలోనే సాయికృష్ణ లాకప్‌ మరణం సంభవించిందని, ఈ ఘటనకు తాను ప్రత్యక్ష సాక్షితో పాటు పాత్రధారినని నాగరాజు పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన పెద్దల పేర్లు బయటకు రాకుండా, తనను అడ్డు తొలగించుకునేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. తాను విచారణకు సహకరించడం లేదని సిట్‌ (SIT) తప్పుడు ప్రచారం చేస్తోందని, పరస్పర విరుద్ధమైన విషయాలతో సర్కారు, పోలీస్‌ పెద్దలు తన నోరు మూయించేందుకు కుతంత్రాలు చేస్తున్నారని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. నాగరాజు నోరు విప్పితే అసలు విషయాలు బయటపడతాయని భావించే పాలకులే ఆయనను అడ్డు తొలగించుకోవాలని పన్నాగం పన్నుతున్నారని స్పష్టమవుతోంది.