పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రధాని మోదీ..
(హైదరాబాద్ న్యూస్టైమ్ - పొలిటికల్ బ్యూరో): ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆదివారం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నివాసాన్ని సందర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన భార్య అన్నాలెజ్నెవా, పిల్లలు అకీరా నందన్, ఆద్యలను ప్రధాని ఆత్మీయంగా పలకరించారు. ఈ భేటీపై మోదీ గారు స్వయంగా స్పందిస్తూ.. "పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లి ఆయనను, వారి కుటుంబ సభ్యులను కలిశాను. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. దేశ ప్రధాని ఒక ప్రాంతీయ నాయకుడి ఇంటికి వెళ్లి, ఆరోగ్యం గురించి ఆరా తీయడం పవన్ కళ్యాణ్ కు మోదీ ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.