ప్రధాని మోదీపై మార్ఫింగ్ పోస్టుల కలకలం: మెటా ఇండియా హెడ్ కు నోటీసులు జారీ

Published on: 31 Jul 2026, 03:58 AM
News Article

హైదరాబాద్, జూలై 31, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అసత్య ప్రచారాలు, మార్ఫింగ్ వీడియోల ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రధాని మోదీని కించపరిచేలా, తప్పుదోవ పట్టించే రీతిలో డిజిటల్‌గా మార్పు చేసిన (మార్ఫింగ్) ఫోటోలు, వీడియోలు, రీల్స్‌ను కొందరు వ్యక్తులు పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ అభ్యంతరకర కంటెంట్‌పై బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందించిన అధికారిక ఫిర్యాదుల ఆధారంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి రెండు వేర్వేరు క్రిమినల్ కేసులను నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS), మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని కఠినమైన నిబంధనల కింద ఈ కేసులు నమోదు చేయబడ్డాయి. ఈ దర్యాప్తులో భాగంగానే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ అయిన మెటా సంస్థ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. అటువంటి అభ్యంతరకర కంటెంట్‌ను తమ ప్లాట్‌ఫారమ్‌లపై ఎలాంటి నిరోధకాలు లేకుండా అనుమతించినందుకు గాను మెటా ఇండియా హెడ్‌ను ఈ కేసులో సహ నిందితుడిగా చేర్చారు. వెంటనే ఆయా లింక్‌లు, అకౌంట్ల వివరాలను అందజేయాలని ఆదేశిస్తూ మెటా ఇండియా హెడ్‌కు అధికారికంగా నోటీసులు జారీ చేశారు. తప్పుడు పోస్టులు సృష్టించి ప్రజల్లో ఉద్రిక్తతలు సంచలనం సృష్టించాలని చూస్తున్న ఆ సైబర్ ఖాతాల నిర్వాహకులను ట్రేస్ అవుట్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.