ప్రియుడి మోజులో కన్నత‌ల్లి ఘాతుకం..

Published on: 19 May 2026, 06:07 AM
News Article


  • ఓల్డ్ అల్వాల్‌లో ఘోరం
  • రెండో పెళ్లికి అడ్డని చిన్నారి తన్విక దారుణ హత్య
  • మేడపైకి తీసుకెళ్లి మాయం
  • సీసీటీవీల ఆధారంగా గుట్టురట్టు

హైదరాబాద్ న్యూస్ టైమ్, అల్వాల్ (హైదరాబాద్): ప్రియుడి మోజులో పడి కన్న ప్రేమ‌ను, మానవత్వాన్ని మరిచిన ఒక కసాయి తల్లి.. తన రెండో పెళ్లికి అడ్డంకిగా మారిందనే నెపంతో ఆరేళ్ల కన్న కూతురిని అత్యంత కిరాతకంగా వాటర్ ట్యాంకులో ముంచి హత్య చేసిన భయానక ఘటన ఓల్డ్ అల్వాల్‌లో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గతంలో తన గర్భాన్ని దాచి రాజు అనే వ్యక్తిని పెళ్లాడిన రేఖ(27), వివాహమైన కొద్దిరోజులకే పాపకు జన్మనివ్వడంతో భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. దాంతో పుట్టింట్లో ఉంటున్న రేఖ, స్థానిక కిరాణా షాపులో పనిచేసే సాయి(21) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని సాయిని కోరగా.. పాప ఉన్న మహిళను ఎలా చేసుకుంటావంటూ సాయి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కన్నకూతురు తన్విక(6) తన పెళ్లికి అడ్డంగా ఉందని భావించిన ఆ పాపాత్మురాలు, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చిన్నారిని మేడపై ఉన్న వాటర్ ట్యాంకులో పడేసి, మూత పెట్టి, ట్యాంకు నిండా నీళ్లు నింపి ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం కూతురు కనిపించడం లేదంటూ నాటకమాడగా, అనుమానం వచ్చిన రేఖ సోదరి శ్వేత పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. రేఖ పాపను మేడపైకి తీసుకెళ్లి, తిరిగి ఒంటరిగా కిందకు రావడం స్పష్టంగా కనిపించింది. దాంతో పోలీసులు తమదైన శైలిలో గట్టిగా ప్రశ్నించడంతో కసాయి తల్లి రేఖ తానే హత్య చేసినట్లు నేరాన్ని ఒప్పుకుంది. ఈ మేరకు రేఖపై హత్య కేసు నమోదు చేయడంతో పాటు, ఈ దారుణానికి పరోక్ష కారకుడైన ప్రియుడు సాయిపై కూడా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.