ప్లేట్ తిప్పేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. సీఎం రేవంత్తో ఎలాంటి విభేదాలు లేవంటూ ప్రకటన!
హైదరాబాద్, సెప్టెంబర్ 5, 2026 (హైదరాబాద్ న్యూస్టైమ్): తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి గళం వినిపిస్తారని ప్రచారం జరిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా మాట మార్చారు. సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ రేవంత్ రెడ్డిని దూషించలేదని, కేవలం ఒకటి, రెండు అంశాల్లో మాత్రమే ఆయనతో విభేదించానని రాజగోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి నిధుల కేటాయింపుపై ఆయన సానుకూలంగా స్పందించారు. కొడంగల్, మధిర నియోజకవర్గాల స్థాయిలో తన మునుగోడుకు కూడా భారీగా నిధులు వచ్చాయని, ఏకంగా రూ.2 వేల కోట్ల నిధులతో తన నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. త్వరలో జరగనున్న ముఖ్యమంత్రి సభకు తన నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలతో పెద్ద ఎత్తున తరలివెళ్లనున్నట్లు వెల్లడించారు. ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లాంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.