బయోమెట్రిక్ వెరిఫికేషన్ తారుమారు.. 'నీట్' పరీక్ష రాస్తూ దొరికిపోయిన ఏడుగురు నకిలీలు.
పాట్నా, జూన్ 22 (హైదరాబాద్ న్యూస్టైమ్): దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ (NEET) పరీక్షలో బీహార్లో మరోసారి భారీ అవకతవకలు కలకలం రేపుతున్నాయి. గతంలో పేపర్ లీక్ కేసులతో సంచలనం సృష్టించిన 'సాల్వర్ గ్యాంగ్'.. ఈసారి ఏకంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ సంస్థ సిబ్బందితో కుమ్మక్కై సరికొత్త దందాకు తెరలేపింది. అసలు విద్యార్థులకు బదులుగా పరీక్ష రాసేందుకు రంగంలోకి దిగిన ఏడుగురు నకిలీ అభ్యర్థులను (ఇంపర్సనేటర్స్) అధికారులు పట్టుకున్నారు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 30 లక్షల నుండి రూ. 40 లక్షల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. పరీక్షా కేంద్రాల్లో నకిలీ అభ్యర్థుల బయోమెట్రిక్ వేలిముద్రలను తారుమారు చేసి సహకరించిన బయోమెట్రిక్ వెరిఫికేషన్ కంపెనీకి చెందిన 14 మంది ఉద్యోగులతో పాటు, మూడు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, గతంలో జరిగిన నీట్ పేపర్ లీక్ కేసులతో ఈ సాల్వర్ గ్యాంగ్కు ఉన్న సంబంధాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు.