మనస్తాపంతో శ్రీవిద్య ఆత్మహత్య!

Published on: 17 Mar 2026, 12:35 PM
News Article
కాకతీయ యూనివర్సిటీ (KU)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తనపై తోటి విద్యార్థులు దొంగతనం నింద వేశారనే తీవ్ర మనస్తాపంతో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చదువుతున్న విద్యార్థిని శ్రీవిద్య (20) ఆత్మహత్యకు పాల్పడింది.

చోరీ ఆరోపణలు: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన శ్రీవిద్య.. కేయూలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతూ పద్మాక్షి హాస్టల్ బి–బ్లాక్‌లో ఉంటోంది. అక్కడున్న కొందరు సీనియర్ విద్యార్థులతో ఆమెకు వివాదం తలెత్తగా, ల్యాప్ టాప్, బంగారం చోరీ చేసింద‌ని ఆరోపిస్తూ శ్రీవిద్యపై ఈనెల 2న‌ వర్సిటీ పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణ: ఆ వస్తువులకు సంబంధించి డబ్బు చెల్లించాలని పోలీసులు శ్రీ‌విద్య త‌ల్లిదండ్రుల‌కు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణ అనంత‌రం శ్రీవిద్యను ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా దుందిరాలపాడులో ఉన్న అమ్మమ్మ ఇంటికి ఆమె తల్లి అంజమ్మ తీసుకెళ్లారు.

ఆత్మహత్యాయత్నం: జరిగిన అవమానంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన శ్రీవిద్య.. ఈనెల 7న ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

వీడియోలో దాడి ఆరోపణలు: ఆత్మహత్యకు ముందు త‌న‌పై స‌హ‌చ‌ర విద్యార్థులు భౌతికంగా దాడి చేశార‌ని తెలుపుతూ శ్రీ‌విద్య‌ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసింది.

నిమ్స్‌లో కన్నుమూత: పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైద‌రాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శ్రీవిద్య తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనపై శ్రీవిద్య త‌ల్లిదండ్రులు మధిర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.