మల్లారెడ్డిగూడెంలో హనుమాన్ ఆలయ నూతన గది ప్రారంభోత్స‌వం

Published on: 10 Sep 2026, 10:53 AM
News Article

సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 10, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామంలో ఉన్న శ్రీ శివభక్తాంజనేయ స్వామి ఆలయం మరో అభివృద్ధి కార్యక్రమానికి వేదికైంది. భక్తుల సౌకర్యార్థం నిర్మించిన నూతన గదిని గురువారం భక్తిశ్రద్ధల నడుమ ప్రారంభించారు. ఆలయ అభివృద్ధికి దివంగత చలమల్ల రంగారెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రూ.3.50 లక్షల విరాళం అందించారు. ఈ విరాళంతో నిర్మించిన గది భక్తులకు ఉపయోగపడనుండటంతో గ్రామస్థులు దాతల సేవాభావాన్ని అభినందించారు. ఈ సందర్భంగా విరాళం అందించిన చలమల్ల నరసింహా రెడ్డి, చలమల్ల కృష్ణా రెడ్డి, చలమల్ల రాజేందర్ రెడ్డిలను ఆలయ కమిటీ సభ్యులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. సమాజ సేవతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దాతలు అందిస్తున్న సహకారం ఆదర్శప్రాయమని పలువురు గ్రామ పెద్దలు కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అన్నం మ‌ల్లేష్, ఉపసర్పంచ్, ఆలయ పాలకవర్గ సభ్యులు, దేవాలయ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది.