మాంసాహారమే మనిషిని మార్చింది..!

Published on: 26 Jun 2026, 03:31 AM
News Article

హైదరాబాద్, జూన్ 26 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఆదిమానవుడు క్రమక్రమంగా ఆధునిక మానవుడిగా మారాడనే పాత నమ్మకాలను పటాపంచలు చేస్తూ బ్రిటన్ శాస్త్రవేత్తలు ఒక సరికొత్త సంచలన నివేదికను విడుదల చేశారు. దాదాపు 20 నుండి 25 లక్షల సంవత్సరాల క్రితం మన పూర్వీకుల శరీర పరిమాణం, బరువులో ఒక్కసారిగా ఊహించని ‘గ్రోత్ స్పర్ట్’ (rapid growth spurt - వేగవంతమైన వృద్ధి) సంభవించిందని ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ (PNAS) జర్నల్‌లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం స్పష్టం చేసింది.

ఆ 50 పౌండ్ల జంప్‌నకు కారణం అదే: రీసెర్చర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. మన అత్యంత ప్రాచీన పూర్వీకులైన 'ఆస్ట్రలోపిథెకస్' (Australopithecus) జాతి సగటున కేవలం ఒక చిన్నపిల్లాడి సైజులో అంటే 88 పౌండ్ల (దాదాపు 40 కిలోలు) బరువు మాత్రమే ఉండేది. కానీ, 20 లక్షల ఏళ్ల క్రితం ‘హోమో ఎరెక్టస్’, ‘హోమో ఎర్గాస్టర్’ జాతులు ఉద్భవించిన సమయంలో వారి శరీర బరువులో ఏకంగా 50 పౌండ్ల భారీ జంప్ కనిపించింది. మన పూర్వీకులు అడవులను దాటి మైదానాల్లోకి రావడం, రెండు కాళ్లపై నిటారుగా నడవడం నేర్చుకోవడంతో పాటు.. జంతు మాంసాన్ని (Animal Protein) విరివిగా తినడం ప్రారంభించడమే ఈ ఆకస్మిక శారీరక ఎదుగుదలకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు.

మాంసాహారం తెచ్చిన విప్లవాత్మక మార్పులు:

  • మరింత దూరం ప్రయాణం: మాంసాహారం ద్వారా లభించిన అదనపు శక్తి వల్ల భారీ శారీరక దారుఢ్యం చేకూరింది. ఇది రెండు కాళ్లపై తక్కువ శక్తితో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఉపయోగపడింది.
  • వేటలో నైపుణ్యం: పెరిగిన బలంతో క్రూర జంతువుల నుండి తమను తాము రక్షించుకోవడంతో పాటు, ఇతర జంతువులను వేటాడటం, ఆహారాన్ని సేకరించడం ఆదిమానవుడికి సులువైంది.

యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ మరియు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సుమారు 21 వేర్వేరు మానవ జాతులకు చెందిన 386 శిలాజాలను (Fossils) 1,000కి పైగా స్టాటిస్టికల్ మోడల్స్ ద్వారా విశ్లేషించి ఈ పూర్తి నివేదికను రూపొందించారు. అయితే, ఇదే సమయంలో 'హోమో ఫ్లోరెసియెన్సిస్' (Hobbits) వంటి మరికొన్ని మానవ జాతులు మాంసాహారానికి దూరంగా ఉండి, పొట్టిగానే ఉండిపోయాయని.. కేవలం మాంసాహారాన్ని అలవాటు చేసుకున్న మన జాతి మాత్రమే ఈ శారీరక, మేధోపరమైన మైలురాళ్లను అందుకుని చరిత్రను తిరగరాసిందని ఈ పరిశోధన తేల్చిచెప్పింది.