సముద్ర గర్భంలో భయంకరమైన రాక్షస జీవి..

Published on: 10 Jun 2026, 09:39 AM
News Article

హైదరాబాద్ న్యూస్‌టైమ్, హైదరాబాద్, జూన్ 10, 2026: భూమిపై క్షీరదాల ఆవిర్భావానికి ముందే, సుమారు 415 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన ప్రపంచంలోనే అత్యంత భారీ తేలు జాతి శిలాజాల (ఫాజిల్స్) అసలు గుర్తింపును శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ధ్రువీకరించారు. బ్రిటన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు అధునాతన ఇమేజింగ్ సాంకేతికతతో జరిపిన విస్తృత పరిశోధనల్లో, 'ప్రియార్క్టరస్ గిగాస్' (Praearcturus gigas) అనే ఈ పురాతన జీవి చరిత్రలోనే అత్యంత పెద్ద తేలు అని తేల్చారు. డేవిడ్ నీల్డ్ నివేదిక ప్రకారం, ఈ జీవి శిలాజాలను మొట్టమొదటిసారిగా 1870లో యూకేలో కనుగొన్నప్పటికీ, ఇది ఏ జాతికి చెందినదనే దానిపై దశాబ్దాలుగా తీవ్ర వివాదం నడుస్తోంది. తాజాగా కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్‌ల సహాయంతో దీని శరీర నిర్మాణాన్ని కెనడాలోని ఇతర పురాతన తేలు శిలాజాలతో పోల్చి చూడగా, ఇది తేలు జాతికే చెందినదని స్పష్టమైంది. సుమారు ఒక మీటరు (3.3 అడుగులు) కంటే ఎక్కువ పొడవుతో, ఒక కుక్క పరిమాణంలో ఉండే ఈ రాక్షస తేలు కొరుకు సూదులు (పించర్స్) మాత్రమే 16 సెంటీమీటర్ల పొడవు ఉండటం విశేషం. జీవులు సముద్రాల నుండి భూమిపైకి వలస రావడం ప్రారంభించిన తొలినాళ్లలో, నేలపై దీనిని ఎదిరించే ఇతర పెద్ద క్రూర జంతువులు ఏవీ లేకపోవడం వల్లే ఇది ఇంత భారీ పరిమాణానికి ఎదిగి తన సామ్రాజ్యాన్ని ఏలగలిగిందని ప్రధాన పరిశోధకుడు రిచీ హోవార్డ్ తెలిపారు. అంతేకాకుండా, దీని కాళ్లపై ఉండే ప్రత్యేక గీతల వంటి నిర్మాణం ద్వారా ఇది శబ్దాలు చేసేదని, అలాగే ఆధునిక ఎండ్రకాయలు, పీతలలో ఉండే శ్వాసకోశ అవయవాల వంటి నిర్మాణాల ఆధారంగా ఇది భూమితో పాటు నీటిలో కూడా వేటాడేదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సముద్రాల నుండి భూమిపైకి వచ్చిన తర్వాత ఈ జీవులు మళ్లీ నీటి జీవనానికి అలవాటు పడి ఉండవచ్చని పాలియోంటాలజిస్ట్ గ్రెగ్ ఎడ్జ్‌కోంబ్ పేర్కొనగా, ఈ అరుదైన ఆవిష్కరణ జీవుల పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.