స్కూల్ డ్రాపౌట్ నుంచి బిలియనీర్‌గా: చంద్రమోగన్ అద్భుత ప్రయాణం!

Published on: 08 Jul 2026, 01:04 PM
News Article

చెన్నై, జూలై 08, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఎటువంటి డిగ్రీలు లేకపోయినా, వారసత్వంగా ఆస్తిపాస్తులు రాకపోయినా, కేవలం పట్టుదల ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చో ఆర్‌.జి. చంద్రమోగన్‌ జీవితం ఒక నిదర్శనం. నెలకు కేవలం రూ. 65 జీతంతో అప్రెంటిస్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన, నేడు రూ. 20,000 కోట్ల విలువైన 'హ్యాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్' (Hatsun Agro Products) సంస్థను స్థాపించి, భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ డైరీ సంస్థగా నిలబెట్టారు.

ఓటమి నుంచి ఆరంభం: తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన చంద్రమోగన్‌, చిన్నతనంలోనే వ్యాపార మెళకువలను గమనించేవారు. 1956లో ఆయన తండ్రి చెన్నైలో చిన్న కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేయగా, అది 1968 నాటికి కుప్పకూలింది. కుటుంబం మొత్తం తిరిగి స్వగ్రామానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో చదువులో రాణించలేకపోయిన చంద్రమోగన్‌ను, ఆయన తండ్రి విలుప్పురంలో ఒక టింబర్ డిపోలో నెలకు రూ. 65 జీతంతో అప్రెంటిస్‌గా చేర్పించారు. అక్కడ ఏడాది పాటు కష్టపడి పనిచేసినా, ఆ జీతం తన గమ్యం కాదని ఆయన గ్రహించారు.

సొంత వ్యాపార దిశగా: తిరిగి చెన్నైకి చేరుకున్న ఆయన, సొంతంగా వ్యాపారం చేయాలనే బలమైన సంకల్పంతో అడుగు ముందుకు వేశారు. తండ్రి అందించిన అండతో, కుటుంబం తమ పూర్వీకుల భూమిని రూ. 13,000కు అమ్మి ఆ మొత్తాన్ని చంద్రమోగన్‌కు మూలధనంగా ఇచ్చారు. ఆ చిన్న పెట్టుబడితో మొదలైన ఆయన ప్రయాణం, క్రమంగా ఐస్‌క్రీమ్ వ్యాపారం వైపు మళ్లింది. కష్టనష్టాలను తట్టుకుని, వ్యాపారంలో ఎదురైన ఒడిదుడుకులను అధిగమిస్తూ ఆయన హ్యాట్సన్ ఆగ్రోను అగ్రస్థానానికి చేర్చారు. నేడు ఆయన సక్సెస్ కథ ఎంతో మంది యువ పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలుస్తోంది.